ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
నిడదవోలు ఇండియన్ బ్యాంక్ నందు ఖాతాదారులకు అవగాహన సదస్సు
న్యూస్4టుడే, నిడదవోలు, 13 ఫిబ్రవరి : నిడదవోలు ఇండియన్ బ్యాంకు నందు సైబర్ ఫ్రాడ్ జరుగు విధానాలను ఖాతాదారులకు వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జోనల్ ఆఫీస్ అఫీషల్ మురళి ప్రసాద్ మాట్లాడుతూ వేరే వారి డబ్బును మన అకౌంట్ ద్వారా బదిలీచేయడం వలన లావాదేవీలు పెరిగి, లిమిట్ పెరిగినప్పుడు అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది, అలా చాలా జరిగాయి, అలాగే డిజిటల్ అరెస్ట్ అంటూ వచ్చే ఫోన్ కాల్స్ వల్ల భయంతో మోసగాళ్ళకు డబ్బు పంపే వారిని కొందరిని గుర్తించి వారికి అవగాహన తెచ్చి వారి డబ్బు మోసగాళ్ళకు పోకుండా కాపాడిన సంఘటనలు ఉన్నాయి. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది అవాస్తవం నమ్మద్దు, భయపడద్దు అని తెలియచేసారు.
నిడదవోలు ఇండియన్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ KYC అప్డేట్ చేయండి లేదంటే అకౌంట్ బ్లాక్ అవుతుంది అని వచ్చే మెసేజ్ లింక్ ఓపెన్ చేయవద్దు, ఫోన్ చేసి మేము మీ బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాం ఓటీపీ చెప్తే అకౌంట్ అప్డేట్ చేస్తాం అని చెప్పినా నమ్మవద్దు అలా చెప్తే వారు అకౌంట్ లో డబ్బు మాయం చేస్తారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలు బాగా పెరిగాయి. రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క లింక్ క్లిక్ తో అకౌంట్ లో డబ్బు మాయం చేస్తున్నారు. ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండడానికి ఈరోజు ఖాతాదారులకు అవగాహన తేవడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియచేసారు.

